నాగర్కర్నూల్, జూలై 18 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ఎగువ నుంచి వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు. నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఎంజీకేఎల్ఐకి సాగునీటి విడుదల సాధ్యం కాదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సరఫరాను కొనసాగించడమే ప్రాధాన్యమని, కల్వకుర్తి లిఫ్ట్ ఆయకట్టుకు నీటి విడుదల కష్టమేనని చెప్పారు. ఎంజీకేఎల్ఐ ద్వారా 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీలు వినియోగించేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 41.45 టీఎంసీలు ఉన్నా అందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కావడంతో వాస్తవంగా వినియోగించదగిన నిల్వ కేవలం 11.45 టీఎంసీలు మాత్రమే ఉందని వివరించారు. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు, గుడిపల్లిగట్టు, జొన్నలబొగుడ, సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో కేవలం 2.23 టీఎంసీలు మాత్రమే ఉందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 టీఎంసీలు కేటాయిస్తున్న వెల్లడించారు.