సీసీసీ నస్పూర్, మే 14 : నస్పూర్లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీలో తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి భూముల రాంమోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో ఫారెస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్, మే 14 : మండలంలోని తిమ్మాపూర్లో వార్డెన్లు శోభారాణి, వినోద్ ఆధ్వర్యంలో ఆదివాసులకు శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదివాసీ యువతకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చుంచు రవి, ఆదివాసీ నాయకుడు గుర్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధిత కుటుంబాలకు..
దండేపల్లి, మే14 : దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన కరోనా బాధిత కుటుంబాలకు సర్పంచ్ గడికొప్పుల రజిని శుక్రవారం రూ.5 వేల విలువైన బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించారు. పాజిటివ్ వచ్చిన వారు అధైర్యపడవద్దని సూచించారు. పాజిటివ్ వచ్చిన తర్వాత తప్పకుండా హోం ఐసొలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలు పాటించాలని పేర్కొన్నారు. గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు గడికొప్పుల సురేందర్ ఉన్నారు.