Dharani | సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ‘భూముల రిజిస్ట్రేషన్ల కోసం అప్పట్ల అనేక తిప్పలు పడ్డం. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా ఊళ్లో ఉన్న వీఆర్వో నుంచి మొదలు పెట్టి గిర్దావర్, తహసీల్దార్, రిజిస్ట్రేషన్, ఆర్డీవో ఆఫీస్ల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగేవాళ్లం. భూముల రిజిస్ట్రేషన్ల కోసం పైసలు ఖర్చు అయ్యేవి. మ్యుటేషన్ కోసం తిప్పలు పడాల్సివచ్చేది. సీఎం కేసీఆర్ ధరణి తెచ్చాక మా తిప్పలు తప్పినయ్. రైతులకు మంచి జరుగుతున్నది. ధరణిని కొనసాగించాల్సిందే’ ఇదీ తహసీల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావుతో పలువురు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయం. మంత్రి హరీశ్రావు బుధవారం సంగారెడ్డి నుంచి మునిపల్లి మండలంలోని సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించేందుకు వెళ్తూ ఆకస్మికంగా సదాశివపేట తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అకస్మాత్తుగా మంత్రి రావడంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు ఆశ్చర్యపోయారు. మంత్రి హరీశ్రావు నేరుగా తహసీల్దార్ చక్రవర్తి చాంబర్లోకి వెళ్లి ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణి రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతున్నదీ లేనిదీ అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో మాట్లాడారు. వారి సంభాషణ యథాతథంగా..
మంత్రి హరీశ్రావు : అమ్మా.. మీరు తహసీల్ ఆఫీస్కు ఎందుకు వచ్చారు?
సూర అనంతమ్మ (నిజాంపూర్): సార్ మా ఆయన అంజిరెడ్డి చనిపోతే ఆయన పేరు మీద ఉన్న 3.27 ఎకరాల భూమి ఫౌతీ మార్పు కోసం దరఖాస్తు చేశాను. అందుకోసమే వచ్చాము.
హరీశ్రావు : ఫౌతీ మార్పు అయిపోయిందా?
సూర అనంతమ్మ: అవును సార్.. ఫౌతీ మార్పు తొందరగానే అయిపోయింది.
హరీశ్రావు : పాత రిజిస్ట్రేషన్ పద్ధ్దతి బాగుందా? కొత్త ధరణి బాగుందా?
విఠల్రెడ్డి, రైతు, నిజాంపూర్ (అనంతమ్మ బంధువు): సార్ ధరణి బాగున్నది. 20 నిమిషాల్లోనే ఫౌతీ అయ్యింది.
హరీశ్రావు: అప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఆర్ఐ నుంచి మొదలు పెట్టి ఆర్డీవో వరకు పోవాల్సి వచ్చేది. టైటిల్ డీడ్ కోసం ఆర్డీవో ఆఫీస్ చుట్టూ రైతులు తిరిగేవారు.. అవునా? కాదా?
విఠల్రెడ్డి : అవును సార్. అప్పట్లో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా తహసీల్, రిజిస్ట్రేషన్, ఆర్డీవో ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేది. పైసలు ఖర్చు అయ్యేవి. మ్యుటేషన్ కోసం ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తి అయితున్నయి.
హరీశ్రావు: కొంతమంది ధరణి బాగా లేదు.. ధరణి వద్దే వద్దు అంటున్నరు కదా?
విఠల్రెడ్డి: అది కరెక్టు కాదు సార్. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. అప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం తిప్పలు అయితుండె. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగే వాళ్లం. మ్యుటేషన్ అయ్యేంత వరకు భూమి మా పేర్ల మీద వచ్చినట్టు కాదు అనే వాళ్లు. ఇప్పుడు 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి అవుతున్నది ఆటోమేటిక్గా. ధరణి ఇట్లనే కొనసాగించాలె సర్.
సదాశివపేట మండలం వెల్టూరు గ్రామానికి చెందిన మ్యాతరి రాములు పది గుంటల భూమిని సంజీవులుకు అమ్మారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రాములుతో మంత్రి హరీశ్రావు ముచ్చటించారు.
హరీశ్రావు: పెద్దాయనా.. భూమి ఎందుకు అమ్ముతున్నవు?
రాములు: సారూ ఊళ్లో నాకు రేకుల ఇల్లు ఉన్నది. పెద్ద గాలి వస్తే రేకులు ఎగిరిపోతున్నయ్. పక్కా ఇల్లు కట్టుకోవాలని పది గుంటల భూమి అమ్ముతున్నా.
హరీశ్ : భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది? ధరణి ఎట్లా ఉన్నది?
రాములు: సారూ ధరణి బాగున్నది. 15 నిమిషాల్లో నేను అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్రిండు. అప్పట్లో భూములు అమ్మాలన్నా, కొనాలన్నా తిప్పలు అయితుండె. ఇప్పుడు తొందరగా రిజిస్ట్రేషన్లు అయితున్నయి.
హరీశ్: రిజిస్ట్రేషన్ల కోసం ఎవరికైనా పైసలు ఇచ్చినవా?
రాములు: సారూ నన్ను ఎవ్వరూ పైసలు అడగలేదు. నేను ఎవ్వరికీ పైసలు ఇవ్వలేదు.
హరీశ్ : భూమి అమ్మిన పైసలు ఖరాబు చేసుకోకు. ఇల్లు మంచిగ కట్టుకో.
రాములు : మీరు జెప్పినట్లే జేస్త సారూ.
సంజీవులు(భూమి కొనుగోలుదారు): ధరణి బాగున్నది సర్. తొందరగానే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ధరణి కొనసాగించాలే.
సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎస్ శివరాములు గతంలో 2.39 ఎకరాల భూమిపై లోన్ తీసుకుని ఎస్బీఐ వద్ద భూమి మార్టిగేజ్ చేశారు. లోన్ పూర్తిగా చెల్లించి తహసీల్ కార్యాలయంలో మార్టిగేజ్ రిలీజ్ చేయించుకునేందుకు వచ్చారు. ఆయనతోనూ మంత్రి మాటలు కలిపారు.
హరీశ్: తహసీల్ ఆఫీసుకు ఏ పని కోసం వచ్చారు?
శివరాములు : సార్ నేను నా మార్టిగేజ్ పేపర్లు రిలీజ్ చేయించుకుందామని వచ్చా. రిలీజ్ కోసం దరఖాస్తు చేసుకున్నా.
హరీశ్ : మరి మార్టిగేజ్ రిలీజ్ చేశారా?
శివరాములు: అవును సార్. తహసీల్ ఆఫీసుకు వచ్చిన 20 నిమిషాల్లోనే ధరణి ద్వారా మార్టిగేజ్ రిలీజ్ చేశారు. తొందరగా పని పూర్తికావడం సంతోషంగా ఉన్నది సర్. ధరణి రైతులకు ఉపయోగకరంగా ఉన్నది. ధరణి కొనసాగించాలె సార్.