హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 870 మంది కానిస్టేబుళ్లను సైబర్ వారియర్స్గా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ఉన్నాడని, సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమస్యలైనా వారితో చెప్పుకోవచ్చని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో క్రైమ్ రిపోర్టర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులే సైబర్ అంబాసిడర్లని అభివర్ణించారు.
వారి ద్వారానే సైబర్ నేరాలపై ప్రజల్లో బాగా అవగాహన పెరుగుతుందని చెప్పారు. కేవలం స్వీయ అవగాహన ద్వారానే 60 శాతం సైబర్ నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) ఇప్పటివరకు 1930 ఫోన్ నంబర్ ద్వారా వచ్చిన 90వేలకు పైగా కాల్స్ను నిర్వహించి.. ఎంతోమంది బాధితులకు బాసటగా నిలిచిందని కొనియాడారు. సరికొత్తగా రోజుకొక కొత్త రూపంలో నమోదవుతున్న సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ పిలుపునిచ్చారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఇప్పటివరకు రూ.128 కోట్లు ఫ్రీజ్ చేశామని, రూ.8 కోట్లను బాధితులకు అప్పగించామని ఆమె వెల్లడించారు. ఈ వర్క్షాపులో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, డార్క్వెబ్ మోసాలు, ఏఐ పోకడలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరును సైబర్ నిపుణుడు సన్నీ క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్సింగ్, విశ్వజిత్, డీసీపీ ప్రసాద్ పాల్గొన్నారు.