DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క-సారలమ్మ జాతర అని తెలిపారు.
రెండు కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోవు నాలుగు రోజులు జాతర నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. సిబ్బందికి డ్యూటీ పాయింట్ల వద్ద సరైన అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ జాతర నిర్వహణలో తొలి ప్రాధాన్యం ఉంటుందని, దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. డీజీపీ వెంట ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, ఇతర అధికారులు ఉన్నారు.