హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ‘ఎన్నికల కోడ్ వచ్చి 15 రోజులు పైగా అవుతుంది. మీ జిల్లాల్లో ఒక్క నోటు కూడా దొరకలేదా? మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారా? లేక….’ అంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా పలు జిల్లాల ఎస్పీలు, సీపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎక్కడిక్కడ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈనెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 375 ఫ్లయింగ్ స్కాడ్స్, 375 చెక్పోస్టులను ఏర్పాటు చేసిన తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దులో ఉన్న ఖమ్మం వంటి సుమారు పది జిల్లాల్లో నేటికీ ఒక్క నోటు కూడా పట్టుబడకపోవడంపై డీజీపీ సీరియస్ అయ్యారు. ఖమ్మం కమిషనర్, మెదక్ సహా.. డబ్బులు అతి తక్కువగా పట్టుబడుతున్న జిల్లాల ఎస్పీలకు ఫోన్లోనే తలంటినట్లు సమాచారం. రవాణాశాఖ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, అటవీశాఖల చెక్పోస్టుల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ.. పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని డీజీపీ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిసింది.