హైదరాబాద్ జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు, జాతీయ నేతల రాష్ట్ర పర్యటనను విజయవంతం చేసిన పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించిన 27 మంది పోలీసు ఉన్నతాధికారులను గురువారం ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసాపత్రాలను పంపించారు. మంగళవారం రాత్రి వీఐపీలు రాష్ట్రంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి.. యాదగిరిగుట్ట సందర్శన, ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభం, రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం, బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వరకూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారని మెచ్చుకొన్నారు.