హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరుగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీజీపీ బీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు వివరాలు వెల్లడించారు. 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత కల్పించామని, ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు బలగాలను మోహరించామని తెలిపారు.
పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్కాస్టింగ్ ఏర్పాటుచేశామని, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు మూడువేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఇందులో టీజీఎస్పీతోపాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాల సిబ్బంది కూడా ఉన్నారని వివరించారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన జనవరి 27 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ వెల్లడించారు. ఇందులో రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ.28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్పోస్టులు, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్పారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు సాగుతున్నాయని, ఇందుకోసం 181 ఫ్లయింగ్ స్వాడ్లు, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయని పేరొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేశామని వివరించారు. వివిధ కేసుల్లో పెండింగ్లో ఉన్న 398 నాన్బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని, కోడ్ ఉల్లంఘనలపై ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ ఎం భగవత్ కూడా పాల్గొన్నారు.