హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శమని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో బుధవారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వారా ఎంపిక చేసిన 75 మంది ఉత్తమ రిసెప్షన్ ఆఫీసర్లు, 68 మంది కొవిడ్ బాధిత పిల్లలకు ప్రత్యేక పురసారాలు, స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు మెరుగైన పోలీసింగ్ కోసం ప్రతి పోలీస్స్టేషన్లో 17 వర్టికల్స్ పని విధానాలను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఈ విధానాన్ని వివిధ రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడికొచ్చి అధ్యయనం చేస్తున్నారని వెల్లడించారు. పోలీస్స్టేషన్ రిసెప్షన్ అధికారి పోలీస్శాఖ ముఖం లాంటి వారని అభివర్ణించారు. పిటిషనర్లకు దరఖాస్తు రాయడంతోపాటు వారికి మార్గదర్శనం చేయాలని డీజీపీ సూచించారు. పోలీస్స్టేషన్ రిసెప్షన్ అధికారి వ్యవస్థ దేశంలో తెలంగాణలోనే ఉన్నదని తెలిపారు. దర్యాప్తు అధికారి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, పిటిషనర్ల మధ్య రిసెప్షన్ అధికారి ఒక వారధిగా ఉండాలని సూచించారు. పౌరుల కోసం వినూత్న విధానాలను ప్రవేశపెట్టే స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఏసీపీ, డీసీపీలలో 20 మందిని ప్రత్యేకంగా గుర్తించి తగు పురసారాలు అందించనున్నట్టు డీజీపీ ప్రకటించారు. ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులను డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు అభిలాష బిస్త్, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మాజీ పోలీస్ అధికారి తనకు వచ్చిన మెడల్స్ను పోలీస్ శాఖకు బహూకరించాలని నిర్ణయించుకున్నారు. మహమ్మద్ ఖాసీం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎస్పీగా పనిచేసే కాలంలో ఆయనకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 16 మెడల్స్ వచ్చాయి. వాటన్నింటినీ పోలీస్ శాఖ మ్యూజియానికి అందచేయాలని నిర్ణయించారు. 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందిన ఖాసీం మంచి అథ్లెట్. తన సర్వీసులో ఆలిండియా పోలీస్ మీట్, ఆలిండియా ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్షిప్, ఆలిండియా పోలీస్ గేమ్స్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్లో అథ్లెట్గా పాల్గొన్నారు. ఆయా పోటీల్లో ఆయనకు 10 గోల్డ్, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. యువ పోలీస్ అధికారులకు స్ఫూర్తినిచ్చేందుకు ఈ మెడల్స్ను పోలీస్ శాఖకు బహూకరించాలని నిర్ణయించుకున్నట్టు ఖాసీం తెలిపారు. వీటిని తెలంగాణ పోలీస్ అకాడమీలోని మ్యూజియంలో ప్రదర్శించడానికి గురువారం డీజీపీ అంజనీకుమార్కు అందించనున్నారు.