హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి వేడుకలు తెలంగాణవ్యాప్తంగా ప్ర శాంతంగా నిర్వహించడంపై పోలీస్ సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏ ర్పాట్లు చేసిన పోలీసులను అభినందించారు. కొన్ని రాష్ర్టాల్లో చెదురుముదురు ఘటనలు జరిగాయని, తెలంగాణలో ప్రశాంతంగా జరగడంపై ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు, యువ పోలీ సు అధికారులు ఇదే అంకితభావాన్ని, ఉత్సాహాన్ని మున్ముందు ఇలానే ప్రదర్శించాలని సూచించారు. ఇలాంటి బందోబస్తుల్లో చురుగ్గా పని చేసిన యువ అధికారులకు రివార్డు ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లను కోరారు.