హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రత విషయంలో రాజీ లేదని, వారి జోలికొస్తే సహించేది లేదని డీజీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవానికి డీజీపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందని, తెలంగాణ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రధానంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ విభాగం, మానవ అక్రమ రవాణా నిరోధ విభాగం, గృహహింస నిరోధ విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కొనియాడారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డీజీ శిఖాగోయల్ మాట్లాడుతూ 2014లో షీటీమ్లు, 2016లో భరోసా కేంద్రాలను ప్రారంభించినట్టు గుర్తుచేశారు. దేశంలో మరే రా్రష్ట్రంలో లేనివిధంగా పోలీసు నియామకాల్లో 33 శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు అభిలాష బిస్త్, స్వాతి లక్రా, డీఐజీ సుమతి, మహిళా పోలీస్ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.