చేర్యాల, మే 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. స్వామి వారి ఉత్సవాలు ముగిసినప్పటికి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పాల్గొన్నారు.