చేర్యాల, మార్చి 24 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు దశకు చేరుకుం టుండడంతో ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) మల్లన్న క్షేత్రానికి(Mallanna temple) భారీగా తరలివస్తున్నారు. 10వ ఆదివారం సందర్భంగా 50వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్ర లేచి స్వామి వారి కాటేజీలలో పవిత్ర స్నానం అచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో ఒగ్గుపూజారులతో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు.
అంతేకాకుండా మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి ఒడి బియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు తదితర పూజలు నిర్వహించారు.