రాజన్న సిరిసిల్ల : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజాము నుండే భక్తులు కోడె మొక్కు చెల్లించడం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి కోడెమొక్కులు, తలనీలాలు, కళ్యాణాల మొక్కులు చెల్లించుకున్నారు. చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజన్నను దాదాపు 30 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, స్వామివారికి సుమారు రూ. 17 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.