Bhadradri | భద్రాచలం : భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. గోదావరి( Godavari ) పరిసరాలు జనసంద్రంగా మారాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో భద్రాచలం( Bhadrachalam ) లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్యను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటల కొద్ది వేచి చూసి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల రాకతో ఆలయ పరిసరాలు, గోదావరి కరకట్ట కిటకిటలాడుతూ కనిపించాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రసాదాల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారికి నిత్య కృత్యం జరిగే నిత్య కల్యాణానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా 276 దంపతుల జంటలు పాల్గొన్నాయి. భక్తుల రద్దీనీ ముందుగానే ఊహించిన దేవస్థాన ఈవో ఎల్.రమాదేవి, ఆలయ అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ అంతరాలయంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.