హుజూరాబాద్/ఇల్లందకుంట, అక్టోబర్ 21: రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని, చేరదీసిన సీఎం కేసీఆర్పైనే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వాణీదేవి ధ్వజమెత్తారు. కేసీఆర్ పార్టీలో, ప్రభుత్వంలో ఈటలకు ప్రాధాన్యమిచ్చారని, ఎన్నో పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. కానీ, ఆయన మాత్రం అవన్నీ మరిచి, స్వార్థం కోసం అన్నం పెట్టిన చేతులకే సున్నం పెట్టారని విమర్శించారు. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్కు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. గురువారం ఇల్లందకుంటలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో నీళ్లు లేక భూములు బీడుగా ఉన్నాయని, ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తున్నదని ఆనందం వ్యక్తంచేశారు. కేసీఆర్ కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. అభివృద్ధి నిరోధకులకు చోటు ఇవ్వవద్దని ప్రజలను కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, సంక్షేమ పథకాలతోపాటు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నదని గుర్తుచేశారు. పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదని చెప్పారు.