చాక్లెట్ నుంచి రాకెట్ దాకా, ఎల్ఈడీ లైట్ల నుంచి శాటిలైట్ దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రికల్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్బస్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. తెలంగాణ అభివృద్ధి, ప్రగతి మీరు అపితే ఆగదు, మీరు కుళ్లుకునేట్టు ఎదుగుతాం. కాళ్లు అడ్డం పెట్టినా ఆగదు.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం తనకుతాను అద్భుత ప్రగతి సాధిస్తూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వసూలైన పన్నుల సొమ్ముతోనే అనేక బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కేటీఆర్ శనివారం సమాధానమిచ్చారు. ‘గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా కేంద్రానికి 4,20,797 కోట్లు చెల్లించారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి 1,95,986 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.2.25 లక్షల కోట్ల తెలంగాణ పన్నుల సొమ్మును ఉత్తరప్రదేశ్, ఇతర బీజేపీ పాలిత అసమర్థ ప్రభుత్వాలు ఉన్నచోట వాడుకొంటున్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామి కావడం మనందరికీ గర్వకారణం. చేతనైతే వచ్చి థాంక్స్ చెప్పండి. తెలంగాణ ప్రజలకు సలాం చెప్పండి. వెటకారపు మాటలతో మా ఆత్మగౌరవాన్ని దెబ్బకొడితే ఊరుకోం, ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే భరించం’అని మోదీని ఉద్దేశించి అన్నారు.
గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మేకిన్ ఇండియా పేరుతో మోదీ 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, అమృత్, అచ్చేదిన్, వికాస్కాల్, అమృత్ కాల్ అన్నారు. అవన్నీ ఏమయ్యాయి?’ అని నిలదీశారు. రాష్ట్ర సర్పంచ్లకు రూ.1,100 కోట్లు విడుదల చేయకుండా కేంద్రం తొక్కి పెట్టిందని ఆరోపించారు. మోదీ భజన కాదు.. విభజన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు.
ప్రతి పరిశ్రమకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ తెలిపారు. ‘చాక్లెట్ నుంచి రాకెట్ దాకా, ఎల్ఈడీ లైట్ల నుంచి శాటిలైట్ దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రికల్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. శత్రుదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించినట్టు, తెలంగాణ మీద కేంద్రం ఆంక్షలు విధిస్తున్నది. తెలంగాణ గొంతునులిమే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ అభివృద్ధి, ప్రగతి మీరు ఆపితే ఆగదు, మీరు కుళ్లుకొనేటట్టు ఎదుగుతాం. కాళ్లు అడ్డం పెట్టినా ఆగదు’ అని స్పష్టంచేశారు.
తెలంగాణ జీఎస్డీపీ 2013-14లో రూ.4,51,580 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.13,27,495 కోట్లు అయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తలసరి ఆదాయం తెలంగాణ వచ్చే నాటికి రూ.1,12,162 ఉంటే, ఇప్పుడు రూ.3,17,115 అయిందని పేర్కొన్నారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కారు కాదు.. కేసీఆర్ డబుల్ ఇంపాక్ట్ సర్కారు కావాలి అని నినదిస్తున్నామని చెప్పారు. ఈసారి కేంద్రంలో కార్పొరేట్ల సర్కారు కాదు, కిసాన్ సర్కారు వస్తుందని, కేసీఆర్ లాంటి ప్రభావంతమైన, ప్రతిభావవంతమైన, నాయకుడు నాయకత్వం వహిస్తాడని కేటీఆర్ పేర్కొన్నారు.