జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అనతికాలంలోనే అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో రూ. 4 కోట్ల 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, వైకుంఠ దామం, కుల సంఘ భవనాలు, బ్రిడ్జి లను ప్రారంభం, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం భారీ నీటి పారుదల ప్రాజెక్టు పూర్తి చేసుకుని 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ , ట్రాక్టర్ , స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని వెల్లడించారు. వైద్యరంగంలో అభివృద్ధి సాధించామని, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.