హనుమకొండ, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర సర్కార్ వైఫల్యంతో దేవాదుల ఆయకట్టు ఆగమైంది. చేతికొచ్చే దశలో యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో నీళ్లున్నా, సాగునీటి సరఫరా విషయంలో సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని జనగామ జిల్లా దేవరుప్పుల, బచ్చన్నపేట, పాలకుర్తి మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. భూగర్భజలాలు అడుగంటి తడులు అందక పంటలు ఎండిపోతున్నాయి. దేవరుప్పుల మండలం యశ్వంతాపూర్ వాగుపై కేసీఆర్ ప్రభుత్వం 10 చెక్ డ్యాములు నిర్మించింది. మూడేండ్ల క్రితం వరకు చెక్డ్యాములు నిండి యాసంగి పంటలకు పుష్కలంగా నీళ్లు వచ్చేవి. నవాబ్పేట రిజర్వాయర్, స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి కాలువల నీటితో ఈ ప్రాంతంలోని చెరువులు నిండుగా ఉండేవి. వరుసగా ఎనిమిదేండ్లు పంటలకు నీటి కరువు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి నిర్వహణను గాలికి వదిలేసింది. పంటల అవసరాలకు అనుగుణంగా సాగునీటి నిర్వహణ లేకపోవడంతో పాలకుర్తి, దేవాదుల మండలాల్లోని చెరువులు నీళ్లు లేక ఖాళీ అవుతున్నాయి.
దేవాదుల నీటి భరోసాతో సాగు చేసిన వరి పొట్టకు వచ్చే దశలో ఎండిపోతున్నది. మొక్కజొన్న పంటలు నేలమట్టమవుతున్నాయి. ధర్మపురం వచ్చే కాలువ పూడుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్టేషన్ఘన్పూర్ నుంచి చెన్నూరు రిజర్వాయర్కు వచ్చే కాలువకు నీరు వదిలితే పంటలు బతుకుతాయని చెబుతున్నారు. భీంఘన్పూర్ రిజర్వాయర్లోని ధర్మసాగర్ రిజర్వాయర్కు అక్కడి నుంచి స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్కు నీళ్లు చేరుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి చెన్నూరు రిజర్వాయర్కు నీళ్లు రావడంలేదు. నవాబుపేట రిజర్వాయర్లో నీళ్లు పుష్కలంగా ఉన్నా అక్కడి నుంచి కాలువలకు, చెరువులకు నీళ్లు వదలడంలేదు. ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉత్తర కాలువ పూడిక తీసినా నిరంతరం నీటి సరఫరా ఉండటం లేదు. పంటలకు మరో వారంలో తీవ్రమైన నీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నీటి నిర్వహణను పట్టించుకోవాలని కోరుతున్నారు.

దేవాదుల ఎత్తిపోతల పథకం కింద వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగునీటి భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసింది. ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలువల్లో పారకం లేక.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు నడువక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. పొట్టకు వచ్చే దశలో వరి ఎర్రబారడంతో చేసేది లేక రైతులు పొలాల్లోకి పశువులను తోలి మేపుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దుబ్బ తండాలో ఎండిన వరిని మేస్తున్న మూగజీవాలు

రెండెకరాల్లో యాసంగి వరి పెడితే సగం ఎండింది. మిగిలిన ఎకరానికి వరుస తడులు పెడుతున్నా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎండిన ఎకరం వెయ్యి రూపాయలకు గొర్ల మేతకు ఇచ్చిన. చెన్నూరు కాలువ ఎండి పోయింది. నీళ్లు వదులుతారనే ఆశ లేదు. నోటికాడి బుక్క మట్టి పాలౌతున్నది. ఇవ్వాళ్ల రేపట్ల దేవాదుల నీరు వదిలితే ఎండిన బోర్లు మళ్ల పోస్తయ్. యాసంగి పంటలు పండుతయ్.
యాసంగిల నాలుగెకరాలు నాటు పెట్టిన. పాత బోరు పోయకపోతే రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి రెండు బోర్లు వేసిన. చుక్క నీళ్లు రాలె. వరి పొట్టకున్నది. కొంత ఈనింది. ఇంక పది రోజులు పారితె బయటపడేటోన్ని. కాలువల్ల నీళ్లు వదిలినా బాగుపడేటోళ్లం. చెన్నూరు కాలువకే నీళ్లు వస్తలేవు. ఇంత అధ్వానమైన నీళ్ల కరువు పదేండ్లలో సూడలే. ఇట్లుంటుదని తెలిస్తే నాటు వేయకపోదుం.
నీళ్లులేక మక్క చేను ఎండుతున్నది. పక్క రైతులను బదలు అడిగి నీళ్లు పెట్టి తడి తిప్పుతున్న. సీఎంగా కేసీఆర్, మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నప్పుడు కుంటల గోదావరి నీళ్లు ఉండేవి. చెలుకలను కూడా పొలాలుగా చేసుకున్నం. ఇప్పుడు గోదావరి నీళ్లు వస్తలేవు. చెరువులు కుంటలు నిండుతలేవు. బోర్లు, బావుల్ల నీళ్లు లేక పంటలు సగం ఎండినయి. దేవాదుల కాలువ నీళ్లు వదలకపోతే ఉన్న పంటలు కూడా మిగులవు..
రెండెకరాలు ఉంటే ఒక్క ఎకరమే నాటేసిన. ఆ ఎకరానికీ నీళ్లు సరిపోతలేవు. చెరువులు, కుంటలల్ల నీళ్లు ఉంటే బోర్లు మంచిగ పోసేటివి. ఈసారి గోదారి నీళ్లు చెరువులకు వస్తలేవు. బోర్లు పోత్తలేవు. పొట్టకొచ్చిన వరి పంట కండ్ల ముందే ఎండుతాంటే కండ్ల నీళ్లు ఆగుతలేవు. గోదారి నీళ్లు చెరువులకు రాకపోతే ఉన్న పంటలూ ఎండిపోతయి.