Ayushman Bharat | (స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల కార్డులనే జారీ చేశారు. ఇందులో 90 శాతం మంది లబ్ధిదారులు ధనిక, మధ్యతరగతి వారే కావడం గమనార్హం. ఆయుష్మాన్ కార్డు ఉన్నప్పటికీ ప్రైవేటు దవాఖానల్లో పేదలకు వైద్యాన్ని నిరాకరిస్తున్న ఘటనలు కోకొల్లలు.
ప్రభుత్వం చెల్లింపుల్లో జాప్యం చేస్తుండటంతోనే కార్డులను అంగీకరించట్లేదని ప్రైవేట్ దవాఖాన నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ‘ఆయుష్మాన్ భారత్’ పథకం పేదలకు ఏ విధంగానూ సాయపడట్లేదని పలువురు వాపోతున్నారు. కాగా, ‘ఆయుష్మాన్ పథకాని’కి సంబంధించిన రిజిస్ట్రేషన్, ట్రీట్మెంట్, బిల్లుల చెల్లింపుల్లో పెద్దమొత్తంలో అవకతవకలను గుర్తించినట్టు ఇటీవల కాగ్ రిపోర్ట్లో బయటపడటం తెలిసిందే.