Bhatti Vikramarka | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఆడలేక పాత గజ్జెలు అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కార్యాచరణ లేక, పాలన చేతగాక, సక్రమంగా సాగు, తాగు నీరందించలేక, కరెంట్ ఇవ్వలేకపోతున్న పాలకపక్షం చేతగానితనాన్ని నిలదీసిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నది. పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నది. ఎండిన పంట పొలాలను సందర్శించి, రైతుల్లో భరోసానింపుతున్న ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్పైనా విమర్శలదాడి చేస్తున్నది. సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్పై నీలాపనిందలు మోపారు. అబద్ధాలు వళ్లించారు. యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణం, భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుత్తు కోతలు, వేతనాల మంజూరు అంశాలపై భట్టి వట్టి మాటలు చెప్పారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. నోటికొచ్చిన అబద్ధాలు ఆడారు. భట్టి మాట్లాడిన అబద్ధాలు.. వాస్తవాలు లేంటో ఇక్కడ చూద్దాం.
అబద్ధం..
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైంది. దాంతో నిర్మాణ వ్యయం పెరిగింది. ముందుకు పోలేము. వెనక్కి రాలేము అన్న చందంగా మారింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రద్దుచేసినా కేసీఆర్ పట్టించుకోలేదు.
వాస్తవం..
కరోనా లాక్డౌన్తో కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో పనుల్లో జాప్యం జరిగింది. లేకపోతే యాదాద్రి ఇప్పటికే పూర్తయ్యేది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించాలని ఎన్టీజీ ఆదేశించింది. ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం ప్లాంట్కు అనుకూలంగా మద్దతు పలికారు.
అబద్ధం..
భద్రాద్రి పవర్ ప్లాంట్ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టారు. దీంతో తడిసి మోపెడవుతున్నది.
వాస్తవం..
భద్రాద్రి పవర్ ప్లాంట్ను గతంలో ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వమే పెండింగ్లో పెట్టింది. ఈ ప్లాంట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటైన సమయంలో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 12 వేల మెగావాట్లు ఉండేది. కానీ, ఉత్పత్తి ఆరు వేలు మాత్రమే. ఇది చాలదంటూ ఏపీ నుంచి 2 వేల మోగావాట్ల విద్యుత్తును అక్కడి ప్రభుత్వం ఇవ్వకుండా మొండికేసింది. రైతులకు, ప్రజలకు త్వరగా కోతల్లేని విద్యుత్తునందించాలన్న సంకల్పంతో కేటీపీఎస్ 7వ ఫేజ్ను పూర్తిచేసి 2 వేల మెగావాట్లను కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా 6 నెలల్లోనే కోతల్లేని విద్యుత్తును అందించగలిగింది.
అబద్ధం..
తెలంగాణలో ఇప్పుడు విద్యుత్తు కోతల్లేవు. మేము అధికారం నుంచి దిగిపోగానే కరెంట్ పోయిందని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారు.
వాస్తవం..
మెయింటెనెన్స్ పేరుతో హైదరాబాద్లో కొంత కాలం క్రితం రోజుకు రెండు గంటలు విద్యుత్తు సరఫరాలో కోతలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 30 నిమిషాల నుంచి 2 గంటలపాటు కోతలు విధించారు. ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అర్జున్ముండా పాల్గొన్న సభలో కరెంట్ కట్ అయ్యింది. జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కరెంట్ కట్ కాగా.. మంత్రి శ్రీధర్బాబు భూపాలపల్లి జిల్లాలో సెల్ఫోన్ లైట్లల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. కోతల్లేవని పైకిచెబుతున్నా ఇవే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అడపాదడపా ఎక్కడో ఓ చోట కరెంట్ కోతలు నిత్యకృత్యం కావడం వాస్తవం.
అబద్ధం..
మార్చి ఒకటో తారీఖునే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు భత్యం చెల్లించాం.
వాస్తవం..
వాస్తవానికి సోమవారం (ఏప్రిల్ 1వ తేదీన) ఉద్యోగులకు వేతనాలు అందలేదు. పెన్షనర్లకు భత్యం చెల్లించలేదు. కానీ, వేతనాలినిచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటున్నది. కాగా, మాడల్ స్కూల్ టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, కేజీబీవీ టీచర్లు, సమగ్రశిక్ష ఉద్యోగులకు పదో తేదీ దాటితే కానీ వేతనాలు పడటం లేదు.
అబద్ధం..
ఎస్ఎల్బీసీ సొరంగం పదేండ్లల్లో ఒక్క అడుగు పనులు ముందుకు పడలేదు.
వాస్తవం..
టన్నెల్ 1 మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు. ఉమ్మడి రాష్ట్రంలో 22.43 కిలోమీటర్లు పూర్తి చేస్తే తెలంగాణ ఏర్పాటు అనంతరం 11.93 కిమీ పూర్తిచేశారు.