హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అభిప్రాయపడ్డారు. తకువ నిధులతో ఎకువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కరీంనగర్ జిల్లాకు సాగునీరు ఇవ్వొచ్చని తెలిపారు.
తక్కువ బడ్జెట్లో వీటిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొనిరావడానికి ఎస్సెల్బీసీ టన్నెల్, నకలగండి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి జాప్యం జరుగుతున్నందున గత కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన రాజీవ్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్ఎస్పీఎల్ రెండవ జోన్లోని కెనాల్కు అనుసంధానం చేస్తే ఖమ్మం జిల్లాకు సాగునీటి ఎద్దడి ఉండదని చెప్పారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. 2024 జూన్ నాటికి పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకొని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్ కేటాయించాలని, డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులు, చేసిన ఖర్చులు, ఇప్పటివరకు జరిగిన పనులు, ఇంకా చేయాల్సిన పనుల వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాసర్ తదితరులు పాల్గొన్నారు.