హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులకు గత కాంగ్రెస్ పాలకులు చేపట్టిన సంస్కరణలే కారణమని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులతోపాటు ఛత్తీస్గఢ్ ఒప్పందంతో ఏ మాత్రం ఉపయోగం లేదని చెప్పారు.
డిస్కంల బకాయిలతో కలిపి విద్యుత్తురంగంలో రూ.1.14 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నదని వివరించారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్తురంగానికి సంబంధించిన శ్వేతపత్రంపై జరిగిన లఘుచర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించామని బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా వాస్తవ పరిస్థితి లేదని పేర్కొన్నారు. డిస్కంల అప్పులతో పోల్చితే ఆస్తుల విలువ మైనస్ 37 శాతం ఉన్నదని వివరించారు.
చేసింది మేము.. చెప్పుకొనేది వాళ్లు
రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు 5,661 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు డిమాండ్ 2023 నాటికి దాదాపు 15,500 మెగావాట్లకు చేరిందని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్ర అవసరాలను గుర్తించిన నాటి కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు 2014కు ముందు తెలంగాణలో జెన్కో థర్మల్, హైడల్, కొత్తగూడెం, కాకతీయ, లోయర్ జూరాల తదితర పనులు ప్రారంభించినట్టు తెలిపారు. విభజన చట్టం ద్వారా, ఎన్టీపీసీ ద్వారా, ఆంధ్రా నుంచి విద్యుత్తు అందేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని, లెక్కలను మసిపూసి మారేడుకాయ చేశారని విమర్శించారు. యాదాద్రి ప్లాంట్ను బొగ్గు గనులకు అత్యంత దూరంలో పెట్టడంతో.. బొగ్గు సరఫరా అదనపు వ్యయమే ఏడాదికి రూ.800 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్తో ఒప్పం దం చేసుకున్న మేరకు కరెంట్ను ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఒప్పం దం ప్రకారం విద్యుత్తు తీసుకురాకపోయినా ట్రాన్స్మిషన్ ఖర్చును చెల్లించాల్సి వస్తున్నదని చెప్పారు.
1.14 లక్షల కోట్ల అప్పులు భారం
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించింది 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ మాత్రమేనని భట్టి విక్రమార్క చెప్పారు. కొత్త విద్యుత్తు ప్రాజెక్టులు కట్టకపోయినా అప్పులు భారీగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యుత్తుపై చేసిన రూ.86,500 కోట్ల అప్పులు, డిస్కంలకు చెల్లించాల్సిన రూ.32,497 కోట్ల బకాయిలు కలిపితే రూ.1,14,057 కోట్ల భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. డిస్కంల పరపతి తగ్గిందని, 2021-22 నాటికి తెలంగాణ డిస్కంల నికర విలువ రూ.మైనస్ 30,876 కోట్లకు పడిపోయిందని, ఆస్తుల పెంచామని ఎలా అంటారని ప్రశ్నించారు.
టీఎస్ జెన్కోకు 2014లో రూ.7,662 కోట్ల అప్పులుండగా ప్రస్తుతం రూ.32,797 కోట్లకు పెరిగాయని తెలిపారు. ట్రాన్స్కో అప్పులు రూ.2,411 నుంచి రూ.9,920 కోట్లకు, డిస్కంల రుణభారం రూ.10,783 కోట్ల నుంచి రూ.35,227 కోట్లకు పెరిగిందని వివరించారు. డిస్కంలకు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులకు ప్రభుత్వశాఖల బకాయిలే కారణమని, ఇవి రూ.28,842 కోట్లు ఉన్నాయని చెప్పారు. సాగునీటిశాఖ రూ.14,193 కోట్లు బకాయిపడిందని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగ పరిస్థితి ఏమాత్రం ఆరోగ్యకరంగాలేదని తెలిపారు.
నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం
రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్తు రంగానిదే కీలకపాత్రని, నమ్మకమైన విద్యుత్తు సరఫరానే పురోగతికి వెన్నెముక అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడానికి అందరి సహకారంతో ముందుకెళ్తామని, ఓల్డ్సిటీలో సమస్యలు పరిష్కారిస్తామని, ఇందుకోసం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.