Bhatti Vikramarka | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. గాంధీభవన్ లో మంగళవారం పాత్రికేయులు ఈ విషయమై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు వడ్లు పండించే రైతులందరికీ బోనస్ ఇస్తామ ని చెప్పి, ఎన్నికలు ముగియగానే మాట మార్చడంపై ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. సన్న వడ్లకే బోనస్ అని అనలేదని, బోనస్ సన్న వడ్లతో మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు. అప్పుడు తాము ఏం చెప్పామన్నది కాదు.. సన్న వడ్ల నుంచి బోనస్ ఇవ్వడం ప్రారంభిస్తున్నామని భట్టి సమర్థించుకున్నారు.
గత ప్రభుత్వానికంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా కేవలం మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పా రు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ధా న్యం అమ్మాక నెలల తరబడి డబ్బుల కోసం రశీదులు పట్టుకొని అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులు, వ్యవసాయం పట్ల కనబరుస్తున్న చిత్తశుద్ధి ప్రతిపక్షాలకు రుచించక రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, వాటి సంఖ్య, ధాన్యం సేకరణ, నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ తమ ప్రభు త్వం ముందంజలో ఉన్నదని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ, అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని, తాము దానికి కూడా కనీస మద్దతు ధర చెల్లించి కొంటామని చెప్పారు.