Christmas | క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లోని కార్యాలయంలో శనివారం క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సంపద ప్రజలకు పంచడంలో భాగంగా పేద కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదే శించారు. క్రిస్మస్ను పేదలు సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేస్తున్నదని, కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేయడంతో పాటు విందు ఏర్పాటు చేయాలని సూచించారు.
క్రిస్మస్ వేడుకలు నిర్వహణ యాక్షన్ ప్లాన్ గురించి మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమెర్ జలీల్ డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు. పేద క్రైస్తవులకు పంపించేసి గిఫ్ట్ ప్యాక్ దుస్తుల నాణ్యతను ఆయన పరిశీలించారు. సమావేశంలో ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ బీఎం ఎక్కా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.