BR Ambedkar Secretariat | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నిహంగులతో కొత్తగా సెక్రటేరియట్ను నిర్మించింది. ఈ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది. ఇప్పటికే పనులన్నీ పూర్తిగా త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కొత్త సచివాలయంలోకి అధికారులు శాఖలను తరలించనున్నారు. రేపటితో మొదలై.. ఈ నెల 28 వరకు తరలింపు కొనసాగనున్నది.
సచివాలయంలో ఒక్కో ఫ్లోర్ను మూడుశాఖలకు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోంశాఖ, రెండో అంతస్తులో ఆర్థికశాఖ, మూడో ఫ్లోర్లో వ్యవసాయం, ఎస్సీ డెవలప్మెంట్ శాఖలకు కేటాయించారు. నాలుగో అంతస్తులో నీటిపారుదలశాఖ, న్యాయశాఖలకు, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్లో సీఎం, సీఎస్లకు కేటాయించారు. లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూమ్లు, వివిధ సేవలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనుండగా.. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో సీఎస్ నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రారంభోత్సవానికి సంబంధించి శాఖలవారీగా బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా.. కొత్త సెక్రటేరియట్ భద్రతను ప్రభుత్వం టీఎస్ఎస్పీకి అప్పగించింది. సచివాలయం సీఎస్ఓగా పీ వెంకట్రాములు వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆయన టీఎస్ఎస్పీ అదనపు కమాండెంట్గా సేవలందిస్తున్నారు. మూడో బెటాలియన్ అదనపు కమాండెంట్గా కొనసాగుతున్నారు.