మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 1 : నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండా రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్లోని ఎస్వీ అగ్రిమాల్ పెస్టిసైడ్ దుకాణం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం పట్టణంలోని ఎస్వీ అగ్రిమాల్ షాప్లో యశస్విని, మైక్రో, బీ 22 మిరప విత్తనాలను 10 మంది రైతులను కలిసి కొనుగోలు చేసినట్టు తెలిపారు. నారు పోసి పది రోజులైనా మొలకలు రాకపోవడంతో షాప్ యజమాని దగ్గరకు వెళ్లి అడిగితే విత్తనాల ఏజెంట్ వచ్చి చూస్తాడని చెప్పారని, ఆయన చూసి 20 రోజులు తర్వాత మొలకలు వస్తాయని చెప్పారని, 25 రోజులైనా మొలకలు రాలేదని వాపోయారు. ఇప్పుడు దుకాణ యజమానిని అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టు చెప్పారు. దుకాణ యజమానిపై చర్యలు తీసుకొని షాప్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.