రంగారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డిజిల్లా బండరావిరాలలో డంపింగ్యార్డు నిర్మాణాన్ని రద్దుచేయాలని పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్కు కదం తొక్కారు. జీవో 20ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, నాయకులు, బాధితులతో కలిసి కలెక్టరేట్కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ వలయాన్ని దాటుకొని బాధితులు పరుగులు తీశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రాంరెడ్డి తదితరులను కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన నాయకులు కలెక్టర్రేట్ ప్రధాన గేటు ను బలవంతంగా తెరిచి లోపలికి పరుగులు తీశారు.
ఈ క్రమంలో లోపలి గేటును పోలీసులు మూసివేయడంతో సుమారు రెండు గంటల పాటు బీఆర్ఎస్ నేతలు, బాధితులు అక్కడే బైటాయించారు. డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజావాణిలో వినతిపత్రం అందజేస్తామని బీఆర్ఎస్ నేతలు, బాధితులు చెప్పినా పోలీసులు నిరాకరించారు. కేవలం ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. కలెక్టర్ లేకపోవడంతో జేసీలు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని నేతలు, బాధితులు కోరారు. బయటకు వచ్చేందుకు జేసీలు అంగీకరించలేదు. ఈ క్రమంలో నాలుగువందల మంది సమావేశమందిరంలోకి పరుగులు తీశారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జేసీ చంద్రరారెడ్డితో మాట్లాడుతుండగానే, ఆయనను బాధితులు చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డును రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జేసీని కోరారు.
కలెక్టరేట్ ఎదుట తోపులాట
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పోలీసులకు బండరావిరాల డంపింగ్యార్డు బాధితులకు మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులను కలిసి తమ సమస్యను చెప్పుకొనేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాధితులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి నాలుగు గంటల పాటు కలెక్టరేట్ ఎదుట నిరీక్షించినా అధికారులెవరూ స్పందించకపోవడం వారిలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాల మధ్యే డంపింగ్యార్డు ఏర్పాటు నిర్ణయం జీవోను రద్దుచేయాలని, మరోచోటుకు మార్చాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బండరావిరాల సర్పంచ్ రవీందర్, సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్రెడ్డి, చిలుకల బుగ్గరాములు, కాల్లె గణేశ్, అల్వాల వెంకట్రెడ్డి, నిట్టు జగదీశ్వర్, మడుపు శివసాయి తదితరులు పాల్గొన్నారు.