మహబూబ్నగర్ : ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖానకు అదనంగా 600 పడకలతో కొత్త దవాఖానను నిర్మించేందుకు, పోస్టుమార్టం గదిని ఆధునీకరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర దవాఖానలో కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన హైఫ్లో నాజల్ కానుల్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోగులకు సేవలందించడంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖాన ముందుంటుందని అన్నారు. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలు సైతం రోగులకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తున్నాయని చెప్పారు.
కరోనా రోగులకు ఇబ్బంది లేకుండా జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, వారంరోజుల్లో మరో 250 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేయనున్నామని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్ర దవాఖానలో కరోనా చికిత్స పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఇతర మందులు, అన్ని సౌకర్యాలను జనరల్ దవాఖానలో అందుబాటులో ఉంచామన్నారు. ఆర్టీ-పీసీఆర్ యంత్రాన్ని సైతం ఏర్పాటు చేశామని, కరోనా బాధితులకు పూర్తిస్థాయి చికిత్స అందించే సామర్థ్యం జనరల్ దవాఖానకు ఉందని పేర్కొన్నారు.
ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కోరారు. గడిచిన నెల రోజుల్లో జిల్లాలో 160 మంది నర్సులను, 15 మంది డాక్టర్లను నియమించుకున్నామని తెలిపారు. భవిష్యత్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర దవాఖానను కార్పొరేట్ దవాఖానకు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, అందుకే రోగుల సంఖ్య పెరిగిందని అన్నారు. అవసరమైతే కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఇంటికే సంచార అంబులెన్స్ క్లినిక్లను పంపిస్తామని అన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రామ్కిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శామ్యూల్, డాక్టర్ సంపత్, డాక్టర్ విజయ్ కాంత్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్లు రామ్ లక్ష్మణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.