హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీతో సంబంధం లేని తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇన్జంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ పర్వేశ్ వర్మ, మంజీందర్సింగ్ సిర్సా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసి.. ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. తన గౌరవమర్యాదలను, ప్రతిష్ఠను మసకబార్చేందుకు వారు అక్రమ పద్ధతులను ఎంచుకున్నారని ఆమె తెలిపారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజంలేదని స్పష్టంచేసిన ఎమ్మెల్సీ కవిత.. తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
26 మంది బీజేపీ కార్యకర్తలపై కేసు
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్దకు ఆందోళన పేరుతో వచ్చి దాడులకు తెగబడిన ఘటనలో 26 మంది బీజేపీ కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు బంజారాహిల్స్లోని కవిత ఇంటి వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్త ప్రశాంత్తోపాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఉదంతంపై కవిత సెక్యూరిటీగార్డు దామోదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 26 మంది బీజేపీ కార్యకర్తలపై ఐపీసీ-341,147,148, 353, 332, 509 రెడ్విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకొని మంగళవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. సొంత పూచీకత్తుపై న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ గూండాల దాడిని ఖండిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఇందల్వాయి, డిచ్పల్లి, బోధన్ మండలం రాంపూర్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దహనం చేశారు. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి, బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ వాతావరణాన్ని చెడగొట్టేందుకు బీజేపీ దాడుల సంస్కృతిని తీసుకొస్తున్నదని మేయర్ వై సునీల్రావు దుయ్యబట్టారు.
ఆధారాలపై తోకముడిచిన బీజేపీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేసిన మరుసటిరోజే బీజే పీ నేతలు తోకముడిచారు. కవిత ప్రమేయం పై ఆధారాలు చూపాలంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్వర్మపై ఢిల్లీలో మంగళవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. మీడియా ప్రశ్నలకు పర్వేశ్ ముఖం చాటేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాత్రపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలంటూ మీడియా ఆయనను పలుమార్లు ప్రశ్నించింది. దీనిపై సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. అన్నీ సీబీఐ చూసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో ‘అన్నీ సీబీఐ చూసుకుంటే మరి మీరు ఎలా ఆరోపణలు చేశారు? బీజేపీ ఎంపీలు సీబీఐ అధికారులా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో నీళ్లు నమిలిన పర్వేశ్వర్మ.. సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి నుంచి వెళ్లిపోయారు.
కవిత ఇంటిపై దాడి హేయం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ గూండాలు దాడికి తెగబడడం హేయమైన చర్య. కేసీఆర్ బిడ్డలా కాకుండా తెలంగాణ ఆడబిడ్డగా రాష్ట్రం కోసం కవిత పోరాటం చేశారు. ఆమె ఇంటిపై రాళ్లు వేసిన బీజేపీ నాయకుల చర్య అప్రజాస్వామికం. దౌర్జన్యాలకు దిగేవారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
-మంత్రి కొప్పుల ఈశ్వర్
తప్పుగా మాట్లాడితే తగిన గుణపాఠం
ఉద్యమ నేత కేసీఆర్ కుటుంబంపై తప్పుగా మాట్లాడే వారికి తగిన గుణపాఠం చెబుతాం. మచ్చలేని సీఎం కేసీఆర్ కుటుంబంపై బీజేపీ విష ప్రచారం చేస్తున్నది. మోదీ, అమిత్షాల అరాచకాలకు హద్దే లేకుండా పోతున్నది. వారి తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నందుకే సీఎం కేసీఆర్పై, ఆయన కుటుంబంపై కుట్రలు చేస్తున్నది. మరోసారి కేసీఆర్ కుటుంబ సభ్యుల జోలికి వస్తే సహించేది లేదు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
బీజేపీ పాచికలు పారవు
తెలంగాణ బిడ్డలు, ఉద్యమకారులు బీజేపీ ఉడత ఊపులకు బెదిరేవారు కారు. తెలంగాణలో విధ్వంసానికి, మతకలహాలకు బీజేపీ కుట్రపన్నుతున్నది. పోరాటాల గడ్డపై ఆ పార్టీ పాచికలు పారవు. కవిత ఇంటి మీద దాడి చేసిన బీజేపీయే.. మళ్లీ తమపై దాడులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది. బీజేపీ విషయంలో మొదటినుంచీ కేసీఆర్ చేస్తున్న హెచ్చరికలే కండ్లముందు కనబడుతున్నాయి. కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు.
– మంత్రి శ్రీనివాస్గౌడ్
మేం తలచుకుంటే బయట తిరగలేరు
మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులంతా వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో ఉన్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గం. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న లక్షలాదిమంది సైన్యం తలుచుకుంటే బీజేపీ నాయకులు ఇండ్ల నుంచి బయటకురాగలరా..? బీజేపీ నేతలు పిచ్చి ప్రయత్నాలు మానుకోకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంస్కారానికి, సహనానికి పరీక్ష పెట్టొద్దు. మేం తలచుకుంటే బీజేపీ నేతలు బయట తిరగలేరు.
– మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
బీజేపీది దౌర్జన్యం
మోదీ పాలనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి భయపడి.. ఆయన కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నిఖార్సైన ఉద్యమకారిణిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడం పిరికిపంద చర్య. టీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే చూస్తూ ఉరుకునేది లేదు. మేం తలుచుకుంటే బీజేపీ నాయకులు రోడ్లమీద తిరుగలేరు.
– మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణలో దాడులకు స్థానం లేదు
బీజేపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. చిల్లర రాజకీయాలు చేసే బీజేపీ నేతలు టీఆర్ఎస్ శ్రేణులు తలచుకుంటే మాడి మసైపోతారు. బీజేపీ ఎన్నికుట్రలు చేసినా టీఆర్ఎస్ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరదు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడినందుకు బీజేపీ నేతలు బహిరంగ క్షమాపణ కోరాలి. తప్పుడు ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను అప్రతిష్ఠ పాల్జేసేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతాం.
– మంత్రి గంగుల కమలాకర్
కీలుబొమ్మలుగా దర్యాప్తు సంస్థలు
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయి. స్వతంత్ర సంస్థల ప్రతిష్ఠను మోదీ ప్రభుత్వం మసకబారుస్తున్నది. దర్యాప్తు పేరుతో రాజకీయ ప్రత్యర్థులను వేధించడం బీజేపీ దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ఠ. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీజేపీ.. కేసీఆర్ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నది. ఎమ్మెల్సీ కవిత నివాసంపై బీజేపీ గూండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– కోలేటి దామోదర్, రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్
వ్యక్తిగత దాడులు అనుచితం
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి చేయడం అనుచితం, ఆటవికం. నాగరిక ప్రపంచంలోనూ ఇంత వికారంగా ప్రవర్తించడం శోచనీయం. అనుమానాలుంటే ఎవరైనా న్యాయవ్యవస్థను ఆశ్రయించవచ్చు. చట్టపరంగా నిజానిజాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అలాకాకుండా వ్యక్తిగత దాడులు చేయడం అమానవీయం.
– ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి