Deeksha Divas | ‘గుండె మండినవాళ్లు కడుపు కాల్చుకుంటే ఎందుకంత మంట. ఎక్కడ ఆపితే అక్కడే దీక్ష మొదలుపెడతాను. కానీ, దీక్షకు దిగితీరుతా’నని శపథం చేసి కదిలిండు కేసీఆర్. అన్నట్టే ఆపిన చోటే దీక్షకు దిగిండు. ‘సాదుకున్నా మీరే.. సంపుకున్నా మీరే’ అని అన్న కేసీఆర్ మాటలతో స్ఫూర్తి పొందిన తెలంగాణ జనం ఆయన తొవ్వలోనే నడిచారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ తేల్చుకుంటానని దీక్షకు దిగిన ఉద్యమ చంద్రుడు ఢిల్లీ మెడలు వంచి నిమ్స్ నుంచి తెలంగాణ జైత్రయాత్ర మొదలుపెట్టిండు.
నవంబర్ 29
మొదక్ జిల్లా సిద్దిపేట మండలం రంగధాంపల్లి చౌరస్తాను ఆమరణ నిరాహార దీక్షా వేదికను చేరుకునేందుకు కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరారు. మానేరు దాటిన తర్వాత పోలీసులు కేసీఆర్ వాహనాన్ని నిలిపివేశారు. బలవంతంగా వేరే వాహనంలోకి మార్చి వరంగల్ జైలుకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. కేసీఆర్ అరెస్ట్ను నిరసిస్తూ టీఆర్ఎస్వీ నాయకుడు శ్రీకాంతాచారి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నారాయణఖేడ్ మండలం పలుగు తండాలో ఏడుగురు చిన్నారులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. కేసీఆర్ను ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఆహారం తీసుకోకుండా, మందులు వేసుకోకుండా జైలులోనే దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.
నవంబర్ 30
టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు ఈ బంద్కు మద్దతిచ్చాయి. న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. 1969 ఉద్యమం తర్వాత తొలిసారిగా తెలంగాణ సంపూర్ణంగా బంద్ జరిగింది. విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. కేసీఆర్ అరెస్టుకు కలతచెంది టీఆర్ఎస్వీ నేత భూక్యా ప్రవీణ్, దుద్దెడకు చెందిన శ్రీకాంత్, దండిక పృథ్వీరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. బొల్లి లక్ష్మీనారాయణ గుండెపోటుతో మరణించారు.
డిసెంబర్ 1
పోలీసులు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న కేటీఆర్, హరీశ్రావును బలవంతంగా ఈడ్చుకుపోయారు. బలవంతంగా స్లైన్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నిస్తే కేసీఆర్ వాళ్లను బయటకు తోసి, తలుపులు వేసుకున్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య కామారెడ్డిలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
డిసెంబర్ 2
విద్యార్థులు, ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. పరామర్శించేందుకు వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడేందుకు కేసీఆర్ నిరాకరించారు.
డిసెంబర్ 3
తెల్లవారుజామున ఖమ్మం నుంచి కేసీఆర్ను నిమ్స్కు తరలించారు. నిమ్స్ నుంచే తెలంగాణ జైత్రయాత్ర. లేకుంటే… నా శవ యాత్రేనని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను ప్రజలు తగులబెట్టారు. తెలంగాణ మంత్రులను తిరగనియ్యమని ప్రజా సంఘాలు ప్రకటించాయి. విద్యార్థి ఉద్యమాన్ని నిలువరించేందుకు ఉన్నత విద్యాసంస్థలకు 15 రోజులు సెలవు ప్రకటించారు. శ్రీకాంతాచారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ జిల్లాలో మల్లెనేని రాజ్కుమార్ మృతి చెందాడు.
డిసెంబర్ 4
రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో కేసీఆర్ను అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. కోమాలోకి పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ప్రజలు మెచ్చే ప్రకటన చేసే వరకు తన దీక్ష, తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 9లోగా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించకుంటే 10న అసెంబ్లీ ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్
ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను ప్రజలు ముట్టడించారు. దిష్టిబొమ్మలను తగులబెట్టారు. తెలంగాణ కోసం 57 సంఘాలు హైదరాబాద్లో సమావేశమయ్యాయి.
డిసెంబర్ 5
తన చేతిలో ఏమీ లేదని సీఎం రోశయ్య ప్రకటించారు. మీరే గట్టెక్కించాలని పీసీసీ అధ్యక్షుడు వీరప్ప మొయిలీని కోరారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలనే ప్రజల ఒత్తిడికి కాంగ్రెస్ నేతలు సోనియాకు లేఖ రాశారు.తెలంగాణ 48 గంటల బంద్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రెండు రోజులపాటు పెన్డౌన్ చేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను పంపాలని కోరింది. హైదరాబాద్లో 144 సెక్షన్ అమలు చేశారు.
డిసెంబర్ 6
48 గంటల బంద్ తొలి 24 గంటలు విజయవంతమైంది. అవయవాలు క్షీణిస్తున్నాయని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిమ్స్ డైరెక్టర్ ప్రకటించారు. దీక్ష విరమిస్తే ప్రాణాలు దక్కుతాయని వైద్యులు సూచించినా కేసీఆర్ తగ్గలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితేనే విరమిస్తానని కేసీఆర్ సీఎంకు తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజధాని ఫ్రీజోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీఆర్పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
డిసెంబర్ 7
48 గంటల తెలంగాణ బంద్ విజయవంతమైంది. మరో ఐదుగురు తెలంగాణ కోసం బలవన్మరణానికి పాల్పడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై చర్చకు సిద్ధమని, తీర్మానం పెట్టలేమని ముఖ్యమంత్రి బీఏసీ సమావేశంలో చెప్పారు. పోలీసులు జర్నలిస్టులపై దాడి చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్న వడ్డెర బస్తీపై పోలీసులు దాడి చేశారు. న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.
డిసెంబర్ 8
కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని, ప్రొటీన్లు, అల్బుమిన్లు లోపించాయని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వైద్యులు చేతులెత్తేశారు. తెలంగాణ ఉద్యమం కోసం మరో ముగ్గురు ఆత్మబలిదానం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు సీఎం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం 23 వేల మందితో కూడిన సాయుధ బలగాలను తెలంగాణ జిల్లాల్లో దింపింది. రాజధానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక ఆంధ్ర కావాలని ఆంధ్రా ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ఆరంభించారు.
డిసెంబర్ 9
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్లో ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని కేసీఆర్ ప్రకటించారు. జయశంకర్ నిమ్మరసం తాగించి కేసీఆర్ దీక్ష విరమింపజేశారు. తెలంగాణ ప్రజల సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా విద్యార్థులు అసెంబ్లీకి జైత్రయాత్ర నిర్వహించారు.