హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/నార్నూర్/జైనూర్/బోధన్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 14 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.. రెండు మూడు రోజులుగా తగ్గుతూ బుధవారం 11.4 డిగ్రీలకు పడిపోయాయి. 14 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని, గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం వడగండ్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో మధ్యాహ్నం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో సాయంత్రం వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాలో రాత్రి 7 గంటల ప్రాంతంలో బోధన్, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా, బోధన్, డిచ్పల్లి మండలాలతోపాటు నిజామాబాద్లోనూ వాన కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్ల వాన పడింది.