COVID-19 | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న కరోనా జేఎన్.1 వేరియంట్తో యావత్తు దేశం అప్రమత్తమై, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. మొన్నటి వరకు కరోనా కేసుల వివరాలతో కూడిన రోజువారీ బులిటిన్ను విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ రెండు రోజులుగా బులిటిన్ను నిలిపివేసింది.
రాష్ట్రవ్యాప్తంగా రోజూ 10 నుం చి 12 కేసులు నమోదయ్యాయి. అందులో 90 శాతం కేసులు గ్రేటర్ పరిధిలోవే. అనారోగ్యంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేరిన ఐదుగురు రోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వారిలో ఇద్దరు మృతిచెందారు. మరుసటి రోజు బులెటిన్ను నిలిపివేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 87 కేసులు నమోదై, రెండు మరణాలు సంభవించాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు.