హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఏప్రిల్ 26న జారీచేసిన నోటిఫికేషన్ సహా ఇతర ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలో గరిష్ఠ వయోపరిమితిని పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏ వెంకన్న, మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ విచారణ చేపట్టింది. ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
టీఎస్పీఎస్సీ 2017 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయనందున, ఈ నాలుగేండ్లను వయోపరితిలో మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బీ రాములు వాదించారు. వయోపరిమితి సడలింపు కోసం గత నెల 26న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినా ఇప్పటివరకు స్పందన లేదని తెలిపారు. తమిళనాడులో ఇచ్చినట్లుగానే తెలంగాణలో కూడా మినహాయింపు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదావేసింది.