రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతున్నది. డెక్కన్ సిమెంట్స్ నుంచి మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్, ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు రోహిణ్రెడ్డి పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారని ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ కూడా ఆరోపించారు. ఇప్పుడు మరోసారి కంపెనీ వ్యవహారంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. అటవీశాఖ భూములను సంస్థ కొల్లగొడుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సాధికార కమిటీ (సీఈసీ) ఈ నెల 25న విచారణ జరుపనున్నది.

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 183 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ భూముల నుంచి సున్నపురాయిని వెలికితీసి తమ సిమెంట్ పరిశ్రమకు ఉపయోగించుకునేవారు. అయితే డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం కేటాయించిన భూమిలోనే కాకుం డా అదనంగా మరో 33 హెక్టార్ల భూమిలో తవ్వకాలు జరిపిందని, నిర్మాణాలు చేపట్టిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గత పదేండ్లుగా వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఇదే విషయమై పసుపులేటి సురేశ్బాబు అనే ఇంజినీర్ ఎన్జీటీలో కూడా కేసు వేశారు.
సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ (సీఈసీ) దీనిపై విచారణ జరుపుతున్నది. సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, ఉల్లంఘనలపై గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన సీఈసీ రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరింది. అయితే ప్రభుత్వం, అటవీ అధికారులు సరైన సమాచారం అందించలేదు. దీంతో ఫిబ్రవరి 25న తమ ముందు హాజరుకావాలంటూ సీఈసీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో సీఈసీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ జరిపే విచారణకు రాష్ట్ర, కేంద్ర అటవీ అధికారులు హాజరుకానున్నారు.
సైదుల్నామా అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన సరిహద్దులను డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం మార్చేసిందని పసుపులేటి సురేశ్బాబు సీఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి హద్దులు చెరిపేశారని ఆరోపించారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా అధికారులు ఏర్పాటుచేసిన సరిహద్దు రాళ్లను ఇష్టానుసారం మార్చేశారని పేర్కొన్నారు. ఆక్రమణలపై డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం నోరు మెదపడం లేదన్నారు. 8 హెక్టార్ల భూమిలో ఆక్రమణలు జరిగినట్టు వారు ఒప్పుకున్నారని, కానీ డెక్కన్ సిమెంట్స్ ఆధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించలేదన్నది ప్రధాన ఆరోపణ. వీటితోపాటు పలు నిర్దిష్టమైన ఆరోపణలపై సీఈసీ విచారణ జరుపనున్నది.