హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు వరకు జరుగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు టీ హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దిన్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో వరదలు, పలు ఇతర బిల్లులపై చర్చించనున్నట్టు మంత్రి ప్రశాంత్రెడ్డి వివరించారు. సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించాలని కాంగ్రెస్ సభ్యులు కోరగా అన్ని అంశాలపై చర్చిస్తామని, కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడినంత సేపు అవకాశమిస్తామని మంత్రి చెప్పారు.
జగ్గారెడ్డితో కేటీఆర్ సరదా వ్యాఖ్యలు
అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ముగిసిన తరువాత లాబీలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ తన చాంబర్వైపు వెళ్తుండగా, కాం గ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా టీ షర్ట్ వేసుకున్న జగ్గారెడ్డి గురించి కేటీఆర్ సరదా వ్యా ఖ్యలు చేశారు. ఆయన జగ్గారెడ్డిని ఉద్దేశిం చి ‘పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్నా?’ అని రాజేందర్తో అన్నారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ.. ‘టీ షర్ట్ వేసుకుంటే చిన్న పిల్లలు అవుతారా?’ అని అన్నారు. ‘మీ ఇద్దరికి దోస్తానా ఎక్కడ కుదిరింది?’ అని కేటీఆర్ రాజేందర్ను ప్రశ్నించారు. ‘మాది ఒకే కంచం, ఒకే మంచం’ అని రాజేందర్ బదులిచ్చారు. ‘మరి జగ్గారెడ్డిని గెలిపిస్తావా?’ అని కేటీఆర్ అనగా.. ‘సంగారెడ్డిలో గెలిపిస్తా.. మన దగ్గరికి పట్టుకొస్తా’ అని రాజేందర్ అన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం కేటీఆర్ను కలిశానని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు.
ఈటలతో కేటీఆర్ ఆలింగనం
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సమావేశమందిరంలో బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ను రాష్ట్ర మం త్రి కే తారకరామారావు వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆప్యాయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు ఈటలతో కేటీఆర్ ముచ్చటించారు. వారిద్దిరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. ఈ సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చారు. సభలోపల ఉన్న కాంగ్రెస్ సభ్యులు శ్రీధర్బాబు, పొదెం వీరయ్య, సీతక్క కూడా అక్కడికి వచ్చి మంత్రి కేటీఆర్ను పలకరించారు.
ప్రత్యర్థులకు కూడా టికెట్లు ఇప్పిస్తా లాబీలో మంత్రి మల్లారెడ్డి చిట్చాట్
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తానే డిసైడ్ చేస్తానని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ సీటుకు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలో తానే నిర్ణయిస్తానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజున మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా మేడ్చల్లో కాంగ్రెస్ టికెట్టును కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి తానే ఇప్పించానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానంలో తనకు దోస్తులున్నారని నవ్వుతూ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దగ్గర డబుల్ బెడ్రూమ్ అంశం తప్ప వేరే సబ్జెక్టు లేదని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తరువాత తన గ్రాఫ్ పెరిగిందని అన్నారు. త్వరలోనే ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని తెలిపారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలని అన్నారు.