CM Revanth Reddy | భూముల క్రమబద్దీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)-2020 దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు రూ.1000 ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. భారీ లే అవుట్స్కు సంబంధించి రూ.10వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అయితే, కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లుగా సంబంధిత శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అప్పటి నిబంధనల ప్రకారమే లే అవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లే-అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులు రావడంతో పాటు నిర్మాణాలకు అనుమతులు లభించడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు, స్థలాల క్రయ విక్రయాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి.