Telangana | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ) : ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వృత్తివిద్యాకోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్లకు 10 ఏండ్ల గడువు విధించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్ కోర్సుల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం 2014లో జీవో జారీచేసి,10 ఏండ్ల గడువు విధించింది. ఈ జీవో గడువు 2023 -24 విద్యాసంవత్సరంతో ముగిసింది. తాజాగా 2024 -25 విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సీట్లకు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం కోల్పోనున్నారు. ఉదాహరణకు ఎంసెట్కు సన్నద్ధమయ్యే ఏపీ విద్యార్థుల్లో అత్యధికులు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్కు దరఖాస్తు చేసుకొంటున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండటమే ఇందుకు తార్కాణం. 2021లో ఏపీ నుంచి దరఖాస్తు చేసుకొన్న వారి సంఖ్య 51,848 మత్రమే కాగా, 2022కు వచ్చేసరికి 53,931కు చేరగా, ఇక 2023లో 56,374కు చేరింది. అయితే, వచ్చే కొత్త విద్యాసంవత్సరం నుంచి ఈ అవకాశం లేకుండాపోయింది.
ప్రవేశ పరీక్షలెప్పుడో..
ఎంసెట్, సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ ప్రస్తుతం డైలామాలో పడింది. విద్యామంత్రి లేకపోవడం, ఉన్నత విద్యామండలి ఖాళీ కావడంతో వీటి నిర్వహణ సందిగ్ధంలో పడింది. రాష్ట్రంలో ఏటా డిసెంబర్ మూడు, నాలుగు వారాల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కసరత్తు మొదలైంది. సెట్ కన్వీనర్లను నియమించి, జనవరిలో అన్ని రకాల షెడ్యూళ్లను విడుదల చేసి, మేలో అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఎంట్రెన్స్ పరీక్షలపై కసరత్తు ఇంత వరకు ప్రారంభంకాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, కొత్త మంత్రుల్లో విద్యాశాఖను ఎవరికి కేటాయించకపోవడంతో ఈ అంశంపై దృష్టిసారించే వారు కరువయ్యారు. ఇంతలోనే ఈ ప్రక్రియను చేపట్టాల్సిన ఉన్నత విద్యామండలి కూడా ఆదివారం ఖాళీ అయ్యింది. చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణల నియామకాలను ప్రభుత్వం రద్దుచేసింది. అటు మంత్రి లేకపోవడం.. ఇటు ఉన్నత విద్యామండలి ఖాళీ కావడంతో ప్రవేశ పరీక్షలపై కసరత్తు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల ఆలస్యమైతే అడ్మిషన్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సీట్ల కేటాయింపు ఇలా..