హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): లైసెన్స్ లేని మెడికల్ షాపులకు, అనర్హులకు మందులు అమ్మితే హోల్సేల్ వ్యాపారులపై, డీలర్లపైనా చర్యలు తీసుకొంటామని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా ఔషధాలు అమ్ముతున్న ఓ మెడికల్ షాపును, క్లినిక్పై అధికారులు కేసు నమోదు చేశారని తెలిపారు. హైదరాబాద్ ఫలక్నుమా పరిధిలోని జంగంమెట్లో కే అచ్యుత రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ నడిపిస్తున్నట్టు తెలిసి తనిఖీలు చేశామని వెల్లడించారు.
40 రకాల ఔషధాలను అమ్ముతున్నట్టు గుర్తించి, రూ.1.20 లక్షల మందులు సీజ్ చేసినట్టు చెప్పారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామంలో డీ శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ నిబంధనలకు విరుద్ధంగా తన క్లినిక్లో ఔషధాలు అమ్ముతున్నట్టు గుర్తించామని తెలిపారు. మొత్తం 41 రకాల మందులను సీజ్ చేశామని, వీటి విలువ రూ.70 వేలు ఉంటుందని పేర్కొన్నారు. వీటిల్లో యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటివి కూడా ఉన్నాయని చెప్పారు. దాడుల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు రాజమౌళి, రాజు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు లక్ష్మి, అనిల్, అన్వేశ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు.