Weather Update | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మండే ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఓ మూడు రోజులు కాస్త ఉపశమనం కలుగనున్నది. దంచి కొడుతున్న ఎండలు కాస్త తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురునిచ్చింది. రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు కమ్ముకుంటుందని వెల్లడించింది.
రాష్ట్రంలో రోజురోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం వివిధ జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.9, హైదరాబాద్లో 40 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని పాటిగడ్డలో అత్యధికంగా గురువారం 40.2 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం వర్షం కురిసి ఉకపోతల నుంచి తెలంగాణవాసులకు ఊరటనిస్తుందో లేదో చూడాలి.