హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 కోట్ల మంది డాటా చోరీ కేసులో.. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డాటా సైబర్ నేరగాళ్లకు ఎలా దొరుకుతున్నది? అని పోలీసులు విచారణ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఆయా బ్యాంకుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులే డాటాను అమ్మేస్తున్నట్టు గుర్తించారు.
బ్యాంక్ యాజమాన్యాలు వెరిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియను ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగిస్తాయి. అందులో పనిచేసే ఉద్యోగులు.. ఆఫీస్ పని మీద వచ్చామని చెప్తూ గంట ముందే బ్యాంక్లోకి వెళ్లి, డాటాను తమవారి ఫోన్లకు పంపుకొంటున్నట్టు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసి, యధావిధిగా అందరూ వచ్చే సమయానికి తిరిగి డ్యూటీలో చేరిపోతున్నారు. ఇంటికి వెళ్లాక డాటాను ఎక్సెల్ షీట్లో తయారుచేసి, సైబర్ నేరగాళ్లకు అమ్మేసినట్టు నిందితులు వెల్లడించారు. ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ బ్యాంకులలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా 98 లక్షల మంది క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల సమాచారాన్ని సైబర్ క్రైం మార్కెట్లో పెట్టేశారు.
బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డు దరఖాస్తు చేసుకొనే వారి వివరాల వెరిఫికేషన్ కోసం కొన్ని ఔట్ సోర్సింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకొని వాటిని అప్పగిస్తాయి. ఈ ఔట్ సోర్సింగ్ సంస్థలు వెరికిఫికేషన్ చేసే సమయంలో నిబంధనలను పాటించాలి. ఈ నిబంధనలను బ్యాంక్ యాజమాన్యాలు రూపొందించాయి. ఆ నిబంధనలను ఔట్సోర్సింగ్ సంస్థలు అమలు చేస్తున్నాయా? లేదా? అని బ్యాంకులు నిఘా పెట్టడం లేదు. ఈ నిర్లక్ష్యాన్ని ఆసరగా చేసుకుని ఔట్సోర్సింగ్ అధికారులు సులభంగా క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల వివరాలను కొట్టేస్తున్నారు.
1) బ్యాంక్ కోడ్ 2)యాక్టివ్/డీయాక్టివ్ 3) లెవెల్ 4) కంట్రోల్ నంబర్ 5) డోర్ నంబర్ 6) పేరు 7) మొబైల్ నంబర్ 8) చిరునామా 9) నగరం 10) రాష్ట్రం 11) ఈమెయిల్ 12) మొదటి స్వైప్ నగదు 13) రెండో స్వైప్ నగదు 14) ఆదాయ ధ్రువీకరణ 15) నగదు విధానం 16) ఫోన్ అలర్ట్స్ 17) ధ్రువీకరణ-1 18) ధ్రువీకరణ-2 వంటి వివరాలు సైబర్ నేరగాళ్లతో పాటు వివిధ వాణిజ్య ప్రకటనల ఏజెన్సీల వద్ద చక్కర్లు కొడుతున్నది.