ఈఎస్ఐలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీల అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి తమకున్న పరిచయాలతో పైరవీలు చేస్తూ సుదీర్ఘ కాలంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే తిష్టవేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 20-30ఏళ్లు గడుస్తున్నా వారు నగరాన్ని వదిలి బయటకు వెళ్లలేదు. కొందరు పైరవీలతో, మరికొందరు యూనియన్ల ముసుగులో నగరంలోనే దశాబ్ధకాలంగా తిష్టవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారి..ఇతర ఉద్యోగులను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు సొంత శాఖలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నలుగురు అధికారులు నగరంలోనే అపాయింట్మెంట్ కావడం, ఇక్కడే పదోన్నతులు పొందడం, ఒకవేళ బదిలీలు జరిగినాహైదరాబాద్, సికింద్రాబాద్ గడప లోపలే పోస్టింగ్లు పొందుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారుల విషయమై కొందరు బాధితులు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, ఐఎంఎస్ ఇన్చార్జ్ డైరెక్టర్తో పాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెక్రటరీ(ఎల్ఎస్టీ)గా పనిచేస్తున్న ఒక అధికారి ఐఎంఎస్లో 1990లో చేరి, దాదాపు 35సంవత్సరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోనే తిష్టవేసినట్లు ఐఎంఎస్ వర్గాల ద్వారా తెలిసింది. పదోన్నతి వచ్చినా, బదిలీ వచ్చినా సదరు అధికారి నగరాన్ని వదిలిపెట్టకుండా తనకున్న పైరవీల బలంతో చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో..
నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్కు పీఎగా విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉద్యోగి 1990లో ఐఎంఎస్లో చేరి, దాదాపు 28సంవత్సరాలుగా హైదరాబాద్ పరిధిలోనే తిష్టవేశారు. అంతే కాకుండా ప్రస్తుతం నాచారంలో కొనసాగుతున్న పోస్టు కూడా అక్రమమని, సీనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్న వ్యక్తికి ఆఫీస్ సూపరింటెండెంట్ హోదోతో కూడిన మెడికల్ సూపరింటెండెంట్ పీఏ హోదాలో కూర్చోబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరం చుట్టే పోస్టింగ్..
నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి సైతం సుమారు 28సంవత్సరాలుగా నగరంలోనే తిష్టవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి సైతం బదిలీ అయినా లేక పదోన్నతి వచ్చిన జంటనగరాల్లోనే తిరుగుతున్నట్లు సొంత శాఖలోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన బదిలీల్లో సద రు అధికారులకు ఇతర ప్రాంతాల్లో అవకాశాలున్నప్పటికీ అక్కడి బదిలీ చేయకుండా మళ్లీ నగరం చుట్టే పోస్టింగ్లు కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎస్లో సాధారణ ఉద్యోగులకు ఒక న్యాయం, పలుకుబడి, పైరవీలు చేసుకునే వారికి మరో న్యాయం జరుగుతోందని సొంత శాఖ వర్గాలే విమర్శించడం గమనార్హం.