హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాథాలజికల్ లయర్గా మారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం నియామకపత్రాలు అందజేస్తున్న ఆయా ఉద్యోగాల సృష్టికర్త కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి తెలివి, సమర్థత ఉంటే కొత్త ఉద్యోగాలను సృష్టించాలని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలో ఉన్న ఉద్యోగాలను కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా? అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇస్తామని చెప్పారా? స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఏ దొడ్లో కడితే ఏమిటి నా దొడ్లో ఈనితే చాలదా? అన్నట్టుగా రేవంత్ వ్యవహారశైలి ఉన్నదని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాను తన ఖాతాలో చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలను ఎకడ గుర్తించారో, ఎలా సృస్టిస్తారో, ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేపలు ఇస్తే.. తాము ఉద్యోగాలు ఇచ్చామంటూ కులవృత్తులను అవమాన పరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ మాటలు ఆధిపత్య అప్పర్ క్లాస్ ఫ్యూడలిజానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని మోదీని బడేభాయ్ అంటున్న రేవంత్రెడ్డి, తమ మధ్య ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్గాంధీ ఒకవైపు మోదీని గద్దె దించాలని చూస్తుంటే, రేవంత్ మాత్రం మోదీయే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది మోదీతో రేవంత్ పెట్టుకున్న పొత్తుకు నిదర్శనమని ఆరోపించారు. గుజరాత్ మాడల్ అబద్ధాల మాడల్ అని కాంగ్రెస్ అధిష్ఠానం అంటుంటే.. రేవంత్ మాత్రం గొప్ప మాడల్ అంటున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ మాడల్ అనేది అట్టర్ఫ్లాప్ మాడల్ అని వివరించారు. రేవంత్ దృష్టిలో గుజరాత్ మాడల్ అంటే తెలంగాణను గోద్రాగా మార్చడమా? అని ప్రశ్నించారు.