హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్కు విజ్ఞప్తిచేశారు. వారు సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. గవర్నర్ కోటాలో తమను ఎమ్మెల్సీలుగా ఎంపికచేస్తూ గత ప్రభుత్వ మంత్రిమండలి తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు.
గవర్నర్ తమ పేర్లను తిరస్కరించిన విషయం తెలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఇంతలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటలో ఆమిర్ అలీఖాన్, కోదండరాంల పేర్లను ఖరారుచేస్తూ గెజిట్ను విడుదల చేసిందని గుర్తుచేశారు. తమ పిటీషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, మంత్రిమండలి తీర్మానాన్ని తిరస్కరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని అభిప్రాయపడిందని తెలిపారు. కొదండరాం, ఆమిర్ అలీఖాన్ల నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దుచేసిందని తెలిపారు.
ఎరుకల, విశ్వబ్రాహ్మణ కులాలకు చెందిన తమకు శాసనమండలిలో కూర్చునే అర్హతలేదా.. అని ప్రశ్నించారు. దాసోజు ఫౌండేషన్ పేరుతో కొవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని,కోర్టు ఆదేశాల ప్రకారం తమకు న్యాయం చేయాలని దాసోజు, కుర్రా విజ్ఞప్తిచేశారు.