హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితిలో మేం ఉన్నాం. సంవత్సర కాలంగా బాధను అనుభవిస్తున్న నేను ఆ బాధను తట్టుకోలేకనే ఇవాళ మీడియా ముందుకు వచ్చానని దాసోజు శ్రవణ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని శ్రవణ్ ప్రకటించారు.
రాజకీయమంటే పేదవాడి సేవ, పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాజకీయాలక్లోకి వచ్చాను. ప్రజారాజ్యం, టీఆర్ఎస్ పార్టీలో పని చేశాను. ఇవాళ్టి వరకు కాంగ్రెస్ పార్టీలో పని చేశాను. నా వల్ల ఇసుమంతైన పేదవాడికి లాభం చేయాలనే ఆకాంక్షతో వచ్చాను. 2013లో రాహుల్ గాంధీ జైపూర్లో చింతన్ శిబిర్లో ఆయన మాట్లాడిన మాటలకు ఆకర్షితుడిని అయ్యాను. ఆయన ప్రసంగానికి ఉత్తేజితుడినై కాంగ్రెస్లో చేరాను. 2014లో పూర్తిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశాను. ఏఐసీసీ అధికారి ప్రతినిధిగా తనకు హోదా కల్పించారు. ముగ్గురు పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ నేతృత్వంలో పని చేశాను. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఒక సంవత్సర కాలంగా కులం, ధనం అనే అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ పార్టీలో దుర్మార్గకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు నాకు బాధ కలిగించాయి. మాణిక్యం ఠాగూర్, సునీల్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు నివేదికలు సృష్టిస్తూ.. మంచి, బలమైన నాయకులను దూరం చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తున్నారు.
రెడ్డి కులస్తులనే రేవంత్ దగ్గరికి తీస్తున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను దూరం చేసుకుంటున్నాడు. కొప్పుల రాజు, జైరాం రమేశ్ కూడా పార్టీని సరిదిద్దలేని పరిస్థితుల్లో ఉన్నారు. పార్టీలో ఉన్న సీనియర్లను బయటకు వెళ్లగొట్టి.. ఆయన సొంత ముఠాను బలోపేతం చేసుకొని, కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని రేవంత్ యత్నిస్తున్నాడు. రాజకీయ, వ్యాపార లబ్ధి పొందేందుకు ఆయన పావులు కదుపుతున్నాడు. ప్రజా శ్రేయస్సు కోసం రేవంత్ పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. మా కులమే రాజకీయం చేయాలని రేవంత్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగత ప్రాబల్యానికి పెంచుకునేందుకు, పార్టీని నాశనం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీగా మారింది. ఎవరికీ అందుబాటులో ఉండడు. రేవంత్ రెడ్డి వద్ద ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4 దర్శనాలు ఉన్నాయి. ఇదేమీ నాయకత్వమో తెలియదు. మనషులకే అందుబాటులో ఉండకుండా రాజకీయం చేయడం ఏంటో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి దాసోజు శ్రవణ్ ఘాటుగా మాట్లాడారు.