Revanth Reddy | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోషల్మీడియా దండుపాళ్యం ముఠా పేట్రేగిపోతున్నది. ప్రత్యర్థి పార్టీలతోపాటు సొంతపార్టీ నేతలను కూడా దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నది. రేవంత్కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఆ ముఠా రంగంలోకి దిగుతుంది. సదరు వ్యక్తులపై అసభ్యకర పోస్టులతో, తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాను నింపేస్తుంది. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరిస్తూ బూతు పురాణం అందుకొంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి, వీ హన్మంతరావు, ఓ టీవీ చానల్ అధినేత కూడా ఈ ముఠా బాధితులే. తనను విమర్శించేవారిని వేధించేందుకు రేవంత్రెడ్డి సొంతంగా ఓ సోషల్ మీడియా బ్యాచ్నే ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఈ బ్యాచ్ను గాంధీ భవన్లో ‘రేవంత్ సోషల్ ముఠా’ అని పిలుస్తున్నారు.
దారుణ ట్రోలింగ్
కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్కు రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరున్నది. రేవంత్ ఒంటెత్తు పోకడలను ప్రశ్నించడాన్ని తట్టుకోలేని రేవంత్ ఈ నేతలపై తన సోషల్ మీడియా ముఠాను ఉసిగొల్పేవారని సమాచారం. రేవంత్ ఆదేశాలతో రెచ్చిపోయిన ముఠా అడ్డు అదుపు లేకుండా ఆ నాయకులకు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టుల వరద పారించేది. ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారని ప్రచారం చేసింది ఈ ముఠానే అని చెప్తున్నారు. ఇదే తరహాలో జగ్గారెడ్డి, కోమటిరెడ్డిపైనా ప్రచారం చేశారు. వీహెచ్నైతే రేవంత్రెడ్డి అభిమాని ఫోన్ చేసి మరీ పచ్చి బూతులు తిట్టాడు.
ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతలపై..
మొన్నటివరకు సొంత పార్టీ నేతలపై తన ముఠాతో సోషల్ మీడియాలో దాడి చేయించిన రేవంత్.. తన కుట్ర బట్టబయలు కావడంతో ఇప్పుడు పక్క పార్టీలపై పడ్డారనే విమర్శలున్నాయి. సాగుకు 3 గంటల కరెంట్ చాలు అన్న రేవంత్పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన ఆ దండుపాళ్యం ముఠా శ్రవణ్ను ఫోకస్ చేసింది. గత గురువారం ఆర్ధరాత్రి ఫోన్ చేసి బూతులు తిడుతూ బెదిరించారు. ఈ విధంగా రేవంత్రెడ్డికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్లపై ఈ ముఠా విషం కక్కతున్నది.
బట్టబయలైన కుట్ర
సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న విష ప్రచారంపై పలు సందర్భాల్లో రేవంత్ వ్యతిరేక వర్గం నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా రేవంత్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ విష ప్రచారంపై తీవ్ర మనస్థాపానికి గురైన ఉత్తమ్ కుమార్రెడ్డి, నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ ఫిర్యాదుతో రేవంత్రెడ్డి కుట్ర బట్టబయలైంది. రేవంత్రెడ్డి కనుసన్నల్లో నడిచే యూత్ కాంగ్రెస్ వార్రూం కేంద్రంగానే ఈ కుట్ర జరుగుతున్నట్టు పోలీసులు తేల్చారు. దీనిపై పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు, ఆ వార్రూం ఇన్చార్జి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. దీనిపై అప్పట్లో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. ప్రశాంత్ అరెస్ట్ తర్వాత నుంచి ఈ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ట్రోలింగ్ ఆగిపోవడం గమనార్హం. దీన్ని బట్టి ఈ కుట్ర ఎవరు చేశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు అంటున్నారు.
నాడు కరెంట్ లేదన్నది నువ్వే.. రేవంత్ వీడియోను జతచేస్తూ దాసోజు శ్రవణ్ ట్వీట్
ఉమ్మడి ఏపీలో ఉచిత కరెంట్ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని, అదంతా ఉత్త ముచ్చటేనని అప్పట్లో రేవంత్రెడ్డే చెప్పారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. అప్పట్లో తన తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లు కూడా లేని దుస్థితి ఉన్నదని, నెత్తిమీద నీళ్లు చల్లుకుని మమ అనిపించామని రేవంత్ అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. రేవంత్ మాట్లాడిన వీడియోను శ్రవణ్ ట్వీట్ చేశారు. ‘ఉమ్మడి ఏపీలో ఉచిత కరెంట్ ఇచ్చామని జబ్బ లు చర్చుకునే కాంగ్రెస్ నాయకులారా! అది ఉత్త ముచ్చటేనని ఇప్పటి మీ పీసీసీ చీఫ్ అంగీకరించారు. గతంలో తన తండ్రి చనిపోతే కరెంట్ లేక తూతూ మంత్రంగా నెత్తిన నీళ్లు చల్లుకొని బాధ పడ్డట్టు తానే చెప్పిన తరువాత కూడా ఇంకా మీరు ప్రజలను మోసం చేయడం తగదు. కేసీఆర్ నాయకత్వంలో సాగునీరు పుష్కలంగా అందుతున్నది. వైకుంఠ ధామాల్లో 24 గంటలు కరెంటు వస్తున్నది. నీళ్లు అందుబాటులో ఉన్నది నిజం కాదా?’ అని శ్రవణ్ ప్రశ్నించారు.