Dasoju Sravan | రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఆదాయ లక్ష్యాలను నిర్ణయించి, అధిక అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతోందని బీఆర్ఎస్ శ్రీమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాగ్ నివేదికలో వెల్లడైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విశ్లేషణాత్మక నివేదికలో తీవ్ర విమర్శలు గుప్పించారు.
2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ₹2.29 లక్షల కోట్లకు పైగా ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, రూ.1.38 లక్షల కోట్లు మాత్రమే వసూలు చేసిందని దాసోజు శ్రవణ్ తెలిపారు. జనవరి 2026 నాటికి సుమారు 60 శాతం మాత్రమే వసూలు చేయగలిగిందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా భారీ లోటు కనిపించడం బడ్జెట్ అంచనాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని సూచిస్తోందన్నారు. ప్రజలకు కాగితాలపై అభివృద్ధి చూపిస్తూ వాస్తవ ఖజానా ఖాళీ అవుతోందని విమర్శించారు. టార్గెట్ 100 శాతమైతే.. సాధించింది కేవలం 60 శాతం మాత్రమేనని.. ఇది కేవలం కాంగ్రెస్ మార్క్ కాగితపు సిరి అని వ్యాఖ్యానించారు.
రియల్ ఎస్టేట్ రంగానికి రివర్స్ గేర్ పడుతోందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. ₹19,087 కోట్ల లక్ష్యానికి వ్యతిరేకంగా సుమారు ₹12,345 కోట్ల వరకే వసూళ్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఆధారంగా నిలిచిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం మందగమనంలో ఉందని, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గడం ఇందుకు కారణమని ఆరోపించారు.
ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాలు కూడా వాస్తవ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయించబడ్డాయని దాసోజు శ్రవణ్ తెలిపారు. ₹27,623 కోట్ల లక్ష్యానికి జనవరి నాటికి సుమారు ₹19,083 కోట్లు మాత్రమే వసూలైనట్లు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఆదాయ సాధన శాతం తగ్గిందని, ఇది ఆర్థిక ప్రణాళికల వైఫల్యాన్ని చూపిస్తోందన్నారు.
ఢిల్లీ యాత్రలు కేవలం ఫొటోషూట్లకే పరిమితమయ్యాయని దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా ఆశించిన స్థాయిలో అందలేదని నివేదికలో పేర్కొన్నారు. ₹22,782 కోట్ల గ్రాంట్లు అంచనా వేయగా జనవరి నాటికి సుమారు ₹4,213 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. అలాగే నాన్ట్యాక్స్ ఆదాయం లక్ష్యానికి కూడా చాలా తక్కువ వసూళ్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. కేంద్రంతో సమన్వయం లోపించడం వల్లే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గాయని విమర్శించారు.
రాష్ట్ర అప్పుల విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని శ్రవణ్ దాసోజు అన్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన ₹54,009 కోట్ల అప్పుల పరిమితిని దాటేసి, జనవరి నాటికే సుమారు ₹69,148 కోట్ల అప్పులు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. అభివృద్ధి , ఆస్తుల సృష్టి కోసం కాకుండా జీతాలు, సాధారణ ఖర్చులు నిర్వహించేందుకు అప్పులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్ తరాలపై అప్పుల భారం పెరుగుతుందని అన్నారు.
చట్టబద్ధమైన అప్పుల పరిమితిని దాటేసి, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కాంగ్రెస్ది అని విమర్శించారు. జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులే దిక్కుగా మారిందని.. అభివృద్ధి ఆగిపోయిందని.. అప్పులు మాత్రం కుప్పలయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి పరిస్తితులు, అంకెల గారడీతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, మూసీ ప్రక్షాళనకు నిధులెక్కడ అని నిలదీశారు. మూసీ ప్రాజెక్టు కేవలం కమీషన్ల కోసమే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలని.. వెంటనే బడ్జెట్ వైఫల్యాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Dasoju Sravan letter 1

Dasoju Sravan letter 2

Dasoju Sravan letter 3