ఎస్సీల జీవితాల్లో గొప్పమార్పు తెచ్చే పథకం ఇది
ఎవరెన్ని కుట్రలు చేసినా అమలు చేసి తీరుతాం
జమ్మికుంట : ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా దళిత బంధు పథకం అమలవుతుందని, అమలు చేసి తీరుతామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈటల, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అమలయితే తమకు కాలం చెల్లినట్లేనన్న భయంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఈ పథకం అమలుతో విపక్షాలకు వెన్నులో వణుకు పుడుతోందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
దళితబంధు పథకం అమలుపై జమ్మికుంట పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి స్థానికులతో చర్చించారు. కేసీఆర్ మాట చెప్పిండంటే తప్పక కట్టుబడి ఉంటరు, ఆయనది ఉడుంపట్టు, పట్టుపట్టిండంటే విడిచి పెట్టరు, నూటికి నూరు పాళ్లు అమలు చేసి తీరుతారని మంత్రి తేల్చిచెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తు చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ దళితబంధును ఒక పథకం మాదిరిగా కాకుండా ఉద్యమం వలె అమలు చేయడం తథ్యమని కొప్పుల స్పష్టం చేశారు.
హూజూరాబాద్ నియోజకవర్గంలో 20వేల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఈ నెలాఖరు వరకు వారి అకౌంట్లలో జమ అవుతాయన్నారు. ఇందులో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలొద్దు. అందరికి తప్పక అందుతాయని మంత్రి హామీచ్చారు. దీనికి సంబంధించి కేసీఆర్ రూ. 2 వేల కోట్లు కేటాయించారని, ఇప్పటికే రూ. 500కోట్లు విడుదల చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, పూలమ్మ, టీఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, రామస్వామి, యాదగిరి, సంపత్, తిరుపతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.