జమ్మికుంట, ఫిబ్రవరి 9: దళితబంధు కోసం ఐక్యం గా ఉద్యమిస్తామని దళితబంధు సాధన సమితి నాయకు లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు సాధి స్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. దళితబంధు సాధన సమితి-హుజూరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సాయి గార్డెన్లో దళితబంధు రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు మొదటి విడత నిధులు వచ్చాయని తెలిపారు. వచ్చిన రూ.5 లక్షలతో లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారని, రెండో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు ఉన్నాయని, వాటిని ఫ్రీజ్ చేయడం బాధాకరమని అన్నారు. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు సకాలంలో రాకపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. సమావేశంలో దళితబంధు సాధన సమితి నాయకులు కొలుగూరి సురేశ్, మంద రాజేశ్, కొలుగూరి నరేశ్, రామంచ రాకేశ్, గాజుల శ్రావణ్, మహేందర్తోపాటు దాదాపు 4 వేల మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.