హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ కేవలం పథకం కాదని.. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న మహోద్యమమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరైతే అవకాశం లేక, సహకారం లేక బాధపడుతున్నారో అలాంటి వర్గాలన్నింటికీ దళితబంధు దారులు వేస్తుందని సీఎం అన్నారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందని, అందరూ దళితబంధు విజయం దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ దళిత బంధు పథకం అవగాహన సదస్సు ఇవాళ ప్రగతి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో దళిత బంధు విజయం ఇతర కులాలకు, వర్గాలకు, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు.. దేశానికే వెలుగు నిస్తుందని అన్నారు. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు కరదీపికలుగా మారాలని ఆకాంక్షించారు.
‘మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్, వంటి పలురకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి, దళిత బంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరినాటు వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్, కోళ్ల పెంపకం, టెంట్ హౌజ్, డెయిరీ పరిశ్రమ, ఆయిల్, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల ఇండస్ట్రీ, హోటల్, స్టీల్ సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫోటో గ్రఫి, వీడియోగ్రఫీ, సెల్ ఫోన్ షాపులు, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉండే ఇతర రంగాలను గుర్తించి వాటిలో రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు అధికారులను చర్యలు తీసుకోవాలి.
దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా, ప్రభుత్వ లబ్ధిదారుని భాగస్వామ్యంతో, శాశ్వత ప్రాతిపదికన దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుంది. దళిత రక్షణ నిధిని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీతో నిర్వహించబడుతుంది.
దళిత బంధు పథకం లబ్ధిదారుడికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తాం. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారుడు తను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప జారి పడనివ్వం.
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. సర్కారే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరాని తనం పేరుతో ఊరవతల వుంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం తెలివి తక్కువ పని, దుర్మార్గం.
నేటి సదస్సులో పాల్గొన్నవారు హుజూరాబాద్లో విజయం సాధించి ముందు రోజుల్లో, తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలి. దళిత బంధు విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితోపాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు పడతాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించింది. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితి మీద నేను అధ్యయనం చేశాను. సెంటర్ ఫర్ సుబాల్టర్న్ స్టడీ ద్వారా అధ్యయనం చేశాన. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలి. కక్ష కార్పణ్యాలు ద్వేషాలు పోవాలి.
ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయం సాధించి పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయి. నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గాదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, కే మానిక్ రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జీ సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు వెంకట్, బాలనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితాసబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం : సీఎం కేసీఆర్
ఆరోగ్యలక్ష్మి పథకానికి నిధులు మంజూరు.. మొత్తం ఎన్ని కోట్లంటే.?
బీజేపీకి మరో షాక్.. మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా